జపాన్‌లో అక్రమంగా మసీదు కట్టిన పాకిస్థానీలు!.. కూల్చివేతకు రంగం సిద్ధం?

  • జపాన్‌లో అక్రమంగా మసీదును నిర్మించిన పాక్ వలసదారులు
  • కూల్చివేతకు సిద్ధమవుతున్న జపాన్ అధికారులు
  • ఏప్రిల్‌లో ఈ మసీదును ప్రారంభించిన పాక్ రాయబారి
  • చట్టాలను గౌరవించాలంటూ పౌరులకు పాక్ ఎంబసీ సూచన
  • కూల్చివేత ప్రతిపాదనను పరిశీలిస్తున్న నగర పాలక సంస్థ
జపాన్‌లోని పాకిస్థానీ వలసదారులకు ఓ మసీదు నిర్మాణం కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. కవాగోయె నగరంలో అక్రమంగా నిర్మించిన ఈ మసీదును కూల్చివేయాలా వద్దా అని అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. విశేషమేమిటంటే, ఏప్రిల్‌లో ఈ మసీదును స్వయంగా జపాన్‌లోని పాకిస్థాన్ రాయబారి అబ్దుల్ హమీద్ ప్రారంభించారు. అయితే, దీని నిర్మాణానికి జపాన్ చట్టాల ప్రకారం అవసరమైన అనుమతులు తీసుకోలేదని స్థానిక అధికారులు తేల్చారు.

ఈ వివాదంపై కవాగోయె నగర పాలక సంస్థ స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. "ఈ మసీదును పట్టణ అభివృద్ధి నియంత్రణ ప్రాంతంలో నిర్మించారు. ఇక్కడ సిటీ ప్లానింగ్ చట్టం ప్రకారం ప్రత్యేక అనుమతులు లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు. కానీ, ఈ భవనాన్ని నగరం నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే నిర్మించారు" అని అధికారులు తెలిపారు. నిబంధనలు సరిదిద్దుకోవాలని సంబంధిత వ్యక్తులకు చాలాసార్లు సూచించినట్లు కూడా పేర్కొన్నారు. ఈ మసీదును కూల్చివేయాలని వచ్చిన ప్రతిపాదనను సమీక్ష కోసం స్వీకరించినట్లు నగర పాలక సంస్థ వెల్లడించింది.

ఈ వ్యవహారం పాకిస్థాన్ రాయబార కార్యాలయాన్ని ఇరకాటంలో పడేసింది. దీంతో వారు వెంటనే స్పందించి, జపాన్ చట్టాలను ఉల్లంఘించే ప్రాజెక్టులతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. స్థానిక ప్రభుత్వాల నుంచి అవసరమైన అనుమతులు పొందాకే ప్రార్థనా స్థలాల నిర్మాణం చేపట్టాలని జపాన్‌లోని పాకిస్థానీ సమాజానికి విజ్ఞప్తి చేసింది. అన్ని అనుమతులు ఉన్నాయని తమకు సమాచారం ఇవ్వడంతోనే రాయబారి అబ్దుల్ హమీద్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారని పాకిస్థాన్ ఎంబసీ వివరణ ఇచ్చింది.

మరోవైపు, అనుమతులు లేకుండా నిర్మాణం జరపడంతో, సమీపంలో నివసిస్తున్న వారికి సరైన వివరణ ఇచ్చారో లేదో కూడా నిర్ధారించుకోలేకపోతున్నామని కవాగోయె అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ మసీదు భవిష్యత్తుపై నగర పాలక సంస్థ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీంతో ఈ నిర్మాణం నిలుస్తుందా లేదా కూల్చివేస్తారా అన్నది ఉత్కంఠగా మారింది.

Pakistanis build mosque illegally in Japan
illegal mosque in Japan

More Telugu News